పైలట్ల నకిలీ లైసెన్సుల వ్యవహారం పాకిస్థాన్లో కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది. పాకిస్థాన్ పార్లమెంట్లోనూ ఈ అంశంపై వాడీవేడీగా చర్చ జరుగుతోంది. టిఒఐ కథనం మేరకు.. మే నెలలో కరాచీ విమానాశ్రయం సమీపంలో ఘోర ప్రమాదం తర్వాత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ విమానయాన సంస్థల్లో మూడో వంతు పైలెట్లవి నకిలీ లైసెన్సులేనని తేలింది. పాకిస్థాన్లో 860 పైలట్ లైసెన్సులు ఉండగా వీటిలో దాదాపు 262 లైసెన్సులు సందేహాస్పదంగా ఉన్నాయని ప్రభుత్వం నివేదిక తెలిపింది.ఒక్క పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ (పీఐఏ)లోనే మూడో వంతు పైలట్లు తప్పుడు విధానంలో లైసెన్సులు పొందినట్లు విచారణలో తేలింది. పీఐఏలో దాదాపు 434 మంది పైలట్లు ఉండగా.. వీరిలో 141 లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు పాకిస్థాన్ విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు. పాక్లో దీనిపై దుమారం కొనసాగుతుండగానే ఈయూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ విమానయాన సంస్థలపై 6 నెలల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈయూ నిర్ణయంతో యూరప్కు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థ ప్రకటించింది.