వాళ్లిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. నాలుగేళ్లు విదేశాల్లో షికార్లు కొట్టి ఎంజాయ్ చేశారు. తర్వాత పెళ్లి చేసుకుని తమిళనాడులోని తంజావూరుకు వచ్చి కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే తన భర్తకు అప్పటికే పెళ్లయిందని, అతడి పేరిట భారీగా ఆస్తులన్నాయని ఆమె తెలుసుకుంది. అతడిని చంపి ఆ నేరాన్ని మొదటి భార్యపై మోపి.. ఆస్తులన్నీ కొట్టేయాలనుకుని ప్లాన్ వేసింది. దీని కోసం తన అందాన్ని ఎరగా వేసి ఫేస్బుక్ ప్రియులు, నలుగురు లాయర్లు, ఐదు మంది కిరాయి హంతకులతో భర్త హత్యకు స్కెచ్ వేసింది. పని పూర్తి చేశాక తనకేం సంబంధం లేనట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె చెప్పే విషయాలపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తంజావూరుకు చెందిన యూసఫ్ కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగ రీత్యా కువైట్ వెళ్లాడు. అక్కడ శ్రీలంకకు చెందిన హసీనా అతడికి పరిచయమైంది. ఇద్దరు ఒకే మతానికి చెందిన వారు కావడంతో ప్రేమ పేరుతో సహజీవనం మొదలుపెట్టారు. అక్కడే ఇద్దరూ పెళ్లి చేసుకున్ని కొన్నాళ్లు కాపురం చేశారు. ఆ తర్వాత యూసఫ్ ఆమెతో కలిసి తంజావూరుకు వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నానంటూ యూసఫ్ తరుచూ తిరుచ్చి వెళ్లి వచ్చేవాడు.అనుమానం వచ్చిన హసీనా ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. ఈ క్రమంలోనే భర్త యూసఫ్ పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయని, బ్యాంకు లాకర్లో 300 సవర్ల బంగారు నగలు, నగదు, ఆస్తి పత్రాలు ఉన్నాయని తెలుసుకుంది. కొద్దిరోజుల తర్వాత అతడు ఉద్యోగం రీత్యా దుబాయి వెళ్లాడు. ఈ సమయంలో ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నలుగురు యువకులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. స్థానికంగా నలుగురు లాయర్లతోనూ అఫైర్ పెట్టుకుని రాసలీలలు సాగించేది. లాయర్ల సాయంతో తన భర్తను ఆస్తిని కొట్టేయాలని హసీనా ప్లాన్ వేసింది.తన ఫేస్బుక్ ప్రియులు, లాయర్లతో తన భర్తను చంపితే రూ.10 లక్షలు ఇస్తానని చెప్పింది. దుబాయ్ నుంచి వచ్చిన యూసఫ్ మూడు రోజుల క్రితం కారుతో తిరుచ్చికి బయలుదేరాడు. ఈ విషయాన్ని హసీనా తన ప్రియులకు చెప్పడంతో అడ్డగించి కత్తులతో వెంటాడి చంపేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురు న్యాయవాదులతో పోలీస్స్టేషన్కు వెళ్లిన హసీనా తన భర్తను మొదటి భార్య, ఆమె బంధువులే చంపి ఉంటారని నమ్మించేందుకు ప్రయత్నించింది. తాము పిలవకుండానే లాయర్లను తీసుకుని రావడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా హసీనా అడ్డంగా దొరికిపోయింది.