ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టుబడులకు జపాన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 01, 2020, 04:26 PM

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు జపాన్‌ ఆసక్తి చూపుతోందని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. పలు కీలకరంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు జపాన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. విశాఖలో పెవిలియన్‌ ప్రాజెక్టు నిర్మాణానికీ ముందుకొచ్చినట్టు వివరించారు. రాష్ట్రంలో కీలకమైన పదిరంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు. సచివాలయం నుంచి జపాన్‌ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో జపాన్‌కు చెందిన జేబీఐసీ, జేఐసీఏ, జపాన్‌ ప్రీమియర్‌ ఫైనాన్సియల్ ఇన్సిటిట్యూషన్‌, ప్రీమియర్‌ జపాన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, కునియమి ఎసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా... పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా సరకు రవాణా.... పోర్టు ఆధారిత క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు ఆక్వాకల్చర్‌ వృద్ధికి, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు జపాన్‌ సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయన్నారు.స్మార్ట్‌ సిటీలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు... ఆర్థిక సహకారం అందించే అంశంపైనా జపాన్‌ సుముఖంగా ఉందని గౌతంరెడ్డి తెలిపారు. భావితరాల కోసం అమరావతిలో ప్రతిపాదించిన పెవిలియన్‌ ప్రాజెక్టును.. విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఓ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ఇందులో భాగంగా 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్‌, కమర్షియల్‌, రెసిడెన్షియల్ అవసరాలకు, అభివృద్ధికి అనుగుణంగా బహుళ ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. విద్య, వైద్య, నైపుణ్యాభివృద్ధి అవసరాల కోసం విశాఖలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పైనా జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నట్లు మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com