కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా మంది యువత వారి సొంత గ్రామాలకు తిరిగి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఇక గ్రామాల్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న వారు ఉపాధి మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీరికి మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం...
కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో స్వయం ఉపాధి పొందాలని భావించే వారికి ఒక స్కీమ్ను అందిస్తోంది. అదే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. గ్రామాల్లో ఈ పథకం కింద సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందే అవకాశం. ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవడానికి రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 75 శాతం అంటే దాదాపు రూ.3.75 లక్షలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. దేశవ్యాప్తంగా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ తక్కువగా ఉన్న కారణంగా వీటి సంఖ్యను బాగా పెంచాలని కేంద్రం యోచిస్తోంది. అందువల్ల ఈ ఆప్షన్ ఎంచుకున్న వారికి మంచి ఉపాధి అవకాశాలు ఉండనున్నాయి. గ్రామాల్లో ఉన్న వారు ఈ స్కీమ్కు అర్హులు. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి మట్టి కండీషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి సాయిల్ టెస్ట్ చేస్తూ ఉంటాయి. దీని ద్వారా నేలలో ఏ ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. వాటిని భూమికి అందించడం ద్వారా పంట బాగా చేతికి వస్తుంది. ఒక్కో శాంపిల్ టెస్టింగ్కు, హెల్త్ కార్డు జారీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.300 అందిస్తుంది. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కోసం జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, జాయింట్ డైరెక్టర్ను కలవొచ్చు. లేదంటే agricoop.nic.in, soilhealth.dac.gov.in వెబ్సైట్ల ద్వారా అవసరమైన సమాచారం పొందొచ్చు. కిసాన్ కాల్ సెంటర్కు (1800-180-1551) కాల్ సెంటర్ కు కాల్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించాలని యోచిస్తే.. దీనికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. షాప్ రెంట్కు తీసుకొని పని చేయడం ఒక పద్ధతి కాగా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ రెండో ఆప్షన్. ఇందులో ఒక వెహికల్పై ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవాలి.