బీహార్లో ఓ పెళ్లి కొడుకు కరోనా లక్షణాలతో మరణించాడు. వివాహం జరిగిన రెండు రోజులకే కన్నుమూశాడు. అంతేకాదు ఆ వివాహానికి హాజరైన వారిలో 95 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. బీహార్ రాజధాని పట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. 30 ఏళ్ల యువకుడు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. మే 12న పాలిగంజ్లో అతడి వివాహం జరిగింది. అయితే అప్పటికే యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా వివాహ తంతు పూర్తి చేశారు. వివాహ అనంతరం ఆ యువకుడు, వధువుతో కలిసి స్వగ్రామం దీహ్పాలికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్నంలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు.