టిక్టాక్ సహా 59 చైనా యాప్స్పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో 'టిక్టాక్ ఇండియా' నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యత విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు పేర్కొంది. భారతీయ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ ప్రభుత్వాలతో పంచుకోలేదని చెప్పుకొచ్చింది. చైనాకు కూడా తాము ఎలాంటి సమాచారాన్ని అందజేయలేదని వివరణ ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా భవిష్యత్తులో సమాచారం కోరినా.. అందజేసే ప్రసక్తే లేదని తెలిపింది. వినియోగదారుల సమాచార భద్రత, గోప్యతకే తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చింది.
యాప్నకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని టిక్టాక్ ఇండియా చీఫ్ నిఖిల్ గాంధీ తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తామని చెప్పారు. టిక్టాక్ని భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు 14 భాషల్లోకి మార్చామన్నారు. దీని వల్ల వివిధ వర్గాలకు చెందిన కోట్ల మంది వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలు చేరువయ్యాయని వివరించారు. చాలా మంది టిక్టాక్పై ఆధారపడి ఉపాధి పొందుతున్నారని.. టిక్టాక్ని నిషేధిస్తే వారంతా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పుకొచ్చారు.