గత కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న మిడతల దండు ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలోని గురుగ్రామ్ లో మరోసారి మిడతల దండు కలకలం సృష్టిస్తోంది. పాక్ నుంచి తాజాగా మరో మిడతల దండు వచ్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు. గురుగ్రామ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో మిడతలు ఆకాశాన్ని కమ్మేశాయి. గురుగ్రామ్ జిల్లాలోని అనేక గ్రామాల్లో భారీ సమూహాలుగా విహరిస్తున్న మిడతల దండుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో నగరపాలక సంస్థ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఢిల్లీ విమానాశ్రయం అధికారులను డీజీసీఏ అప్రమత్తం చేసింది. పైలట్లు విమానాలు దింపే సమయంలో, ఎగిరే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. మిడతల దండు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది కాబట్టి ముప్పు ఉండవచ్చని హెచ్చరించింది. 1993 తర్వాత ఈ స్థాయిలో మిడతల దండు ప్రమాదం లేదని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం పాక్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరుగుతుంది. కానీ ఈ సారి మిడతల దండు రాజస్థాన్ తో పాటు ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,ఛత్తీస్ ఘడ్,గుజరాత్,పంజాబ్, ఢిల్లీ,తెలంగాణ,ఏపీ వరకు కూడా వచ్చాయి.
మిడతల దండు ప్రభావం పోయిందనుకుంటే మళ్లీ వచ్చి పడింది. దీంతో రైతులు అంతా అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు మిడతల దండు నియంత్రణ చర్యలు చేపట్టాయి. తెలంగాణ సర్కార్ ఏకంగా ప్రత్యేక కమిటిని వేసింది. మిడతల దండు నుంచి మరోసారి ప్రమాదం పొంచి ఉన్న అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.