సభ్య సమాజం తలదించుకునేలా కన్న తండ్రే తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వింజమూరు పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను గురువారం ఉదయం బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అదేరోజు సాయంత్రం ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి తీసుకువస్తూ మద్యంమత్తులో మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.బాజిరెడ్డి తెలిపారు.