సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఓ మహిళకు అకస్మాత్తుగా షాకింగ్ నిజం తెలిసింది. కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" అని తేలింది. ఈ విచిత్ర ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. కోల్కతాలోని బీర్భమ్కు చెందిన ముప్పై యేళ్ల మహిళ కడుపు నొప్పితో కొద్ది నెలల క్రితం నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెను పరీక్షించగా.. టెస్టిక్యులర్(వృషణ) క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. దీంతో పాటు మరో షాకింగ్ నిజం తెలిసింది. మెడికల్ రిపోర్టులో ఆమె పురుషుడని తేలింది. సాధారణంగా మహిళల్లో XX క్రోమోజోములు ఉంటాయి. కానీ, ఆమెలో మాత్రం పురుషుని వలె XY క్రోమోజోములు ఉన్నాయి. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ చేస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆమె పెళ్లి చేసుకుని 9 సంవత్సరాలు అవుతుండగా వీరికి పిల్లలు లేరు. దీని గురించి ఆమెకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె 28 ఏళ్ల సోదరికి "ఆండ్రోజెన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్" ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే జన్యుపరంగా అబ్బాయిలా జన్మించినప్పటికీ, పైకి మాత్రం అమ్మాయిలాగే కనిపిస్తుంది. డాక్టర్లు ఈ విషయంపై వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.