కాశ్మీర్లో ఉగ్రవాదులకు సైనికులు దీటైన సమాధానం ఇచచారు. గురువారం తెల్లవారుజామునే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పాకిస్తాన్ మరో భారీ దాడులకు కుట్ర పన్నుతున్నట్టు భారత ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద ఎత్తున లష్కరే – జైషే మహ్మద్ ఉగ్రవాదుల బృందం పీవోకే ద్వారా కశ్మీర్ లోకి ప్రవేశించి భారీ దాడులకు ప్లాన్ చేసిందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లోని సోపోర్ జిల్లాలోని హర్డ్శివ ప్రాంతంలో ఉగ్రవాదులు బస చేస్తున్నారని సమాచారం అందుకున్న భద్రతా దళాలు, సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహించాయి. దీంతో భద్రతా దళాల జాడ గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఒక బృందంగా ఉన్నట్లు గుర్తించారు. అటు బుద్గాంలోని నర్బల్ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ లో 5 మంది ఉగ్రవాద అనుచరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 రౌండ్ల బుల్లెట్లు, ఏకే47, ఒక మ్యాగజైన్, మరికొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.