పంజాబ్ లోని పాటియాలలో దారుణం జరిగింది. అర్దరాత్రి భార్యతో కలిసి వెళ్తున్న వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు అడ్డుకొని దాడి చేసి కొట్టి చంపారు. ఆమె తన భార్య అని అతను చెప్పినా వారు వినలేదు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.బీహార్ కు చెందిన మిథున్ పటేల్ పాటియాలా పరిధిలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అతను తన భార్యతో కలిసి రాత్రి వేళ గురుద్వారాకు బయల్దేరాడు. వారు నడుచుకుంటు వెళ్తుండగా మధ్యలో శంకర్ పూర్ గ్రామానికి చెందిన జగన్మోహన్,హర్యానా కురుక్షేత్ర జిల్లాకు చెందిన భూపిందర్ సింగ్ వారిని అడ్డుకున్నారు. రాత్రి పూట అమ్మాయితో ఎక్కడికని ప్రశ్నించారు. ఆమె తన భార్య అని మిథున్ వారికి సమాధానం ఇచ్చినప్పటికి వారు వినలేదు.దీంతో ఇరువురికి మాటామాట పెరిగింది. మద్యం మత్తులో ఉన్న జగన్మోహన్,భూపిందర్ సింగ్ మిథున్ పై దాడి చేశారు. బీరు సీసాలతో పొడిచారు. ఇటుక పెళ్లలతో కొట్టారు. రాళ్లతో కొట్టారు. మిథున్ ఆమె తన భార్యే అని మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు. తీవ్ర గాయాలపాలైన మిథున్ పాటియాలలోని రాజేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మిథున్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.