ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అల్ ఖైదా సంస్థ వ్యవస్థాపకుడు అయిన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించారు. పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. ‘అమెరికా వాళ్లు అబోటాబాద్ వచ్చి బిన్ లాడెన్ను చంపారు. అదే అమరుడిని చేశారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని టెలివిజన్ ఛానల్స్లోనూ ఈ లైవ్ ప్రసారం అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.మొదటిసారి బిన్ లాడెన్ను చంపేశారు అన్న ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వెంటనే అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. సాధారణంగా సైనికులు తమ దేశం కోసం పోరాడుతూ శత్రువుల చేతిలో మరణిస్తే వారిని అమరజవాన్లు, అమరవీరులు అంటారు. కానీ, 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్ను కూల్చివేయించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచం మొత్తాన్ని వణికించి, ఉగ్రవాదంతో ఎన్నో లక్షల మంది జీవితాలను ఛిద్రం చేసిన ఒసామా బిన్ లాడెన్ను ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించడం గమనార్హం.అమెరికా చేసిన పనిని ఆ దేశంలో 90 శాతం మంది ప్రజలు సమర్థించారు. ఐక్యరాజ్యసమితి, నాటో, యూరోపియన్, ఇతర ప్రపంచంలోని మెజారిటీ దేశాలు బిన్ లాడెన్ హత్యను స్వాగతించాయి. అయితే, పాకిస్తాన్లోని మూడింట రెండు వంతుల మంది ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ఈ ఘటనపై విచారణకు అప్పటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ ఓ కమిటీని నియమించారు. ఆ ఘటనలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని ఆ కమిటీ రిపోర్టులో పేర్కొంది.