ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్లో పిడుగుపాట్లు మృత్యుఘోషను మిగిల్చాయి. గురువారం బిహార్లోని పలు జిల్లాల్లో పిడుగులు ఏకధాటిగా పడ్డాయి. పిడుగుపాట్లకు బిహార్లో 83 మంది మరణించారు. గోపాల్గంజ్ జిల్లాలో అత్యధికంగా 13 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాల వారీగా చూస్తే నవాడాలో 8మంది, మధువనిలో 8 మంది, సివాన్లో ఆరుగురు, భగల్పూర్ జిల్లాలో ఆరుగురు మరణించారు. ఇక తూర్పు చంపారన్, దర్భాంగ, బంకా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు.
ఖగారియా, ఔరంగాబాద్ జిల్లాలో ముగ్గురు మరణించగా పశ్చిమ చంపారన్, కిషన్గంజ్, జహనాబాద్, జముయీ, పూర్ణియా, సుపాల్, బక్సార్, కైమూర్ జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు. మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు బిహార్ ప్రభుత్వం రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
అటు ఉత్తరప్రదేశ్లోనూ పిడుగులు పడి 24 మంది చనిపోయారు. డియోరియా జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు. ప్రయాగ్రాజ్లో ఆరుగురు, అంబేడ్కర్నగర్ జిల్లాలో ముగ్గురు మృతిచెందారు. ఖుషినగర్, ఫతేపూర్, ఉన్నా, బలరాంపూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుపాటుకు గురై మరణించిన వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. బిహార్లో పిడుగులు పడి 83 మంది మృతి చెందడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.