కరోనా వేళ ప్రతీ ఒక్కరి జీవన శైలి మారిపోయింది. శానిటైజర్, మాస్కుల వినియోగం, సామాజిక దూరం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో దొంగలు సైతం శానిటైజర్ రాసుకుని దొంగతనం చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని దౌల్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు దుకాణాల్లో ఇటీవల దొంగతనం జరిగింది. భారీగా సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే దొంగతనం జరిగిన మరునాడు షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే సీసీటీవీ ఫుటేజీలో దొంగలు మొదట శానిటైజర్ తో చక్కగా చేతులు శుభ్రపరుచుకోవడం, అనంతరం అక్కడ ఉన్న తినుబండారాలను ఆరగించడం, ఆ తర్వాత తాపీగా మరోసారి చేతులు శానిటైజ్ చేసుకోవడం అన్నీ రికార్డయ్యాయి. రూ. 5 వేల నగదుతోపాటు రూ.లక్ష విలువైన నిత్యావసరాలను ఈ కరోనాకాలపు దొంగలు ఎత్తుకెళ్లారని గుర్తించారు.