నలంద కిశోర్ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అనంతరం నేరుగా ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నలంద కిశోర్ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. కిశోర్ అరెస్ట్పై గంటా శ్రీనివాసరావు స్పందించారు. అర్ధరాత్రి వేళ ఓ పెద్దాయనను ఇలా అదుపులోకి తీసుకోవడం సరికాదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును ఆయన ఫార్వార్డ్ మాత్రమే చేశారని అన్నారు. మరోవైపు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితోపాటు ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.