భారత దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 4 లక్షలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జూలై 1 నాటికి ఈ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుందని అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతికి చెందిన రీసెర్చర్ భ్రమర్ ముఖర్జీ తెలిపారు. దేశంలో ర్యాపిడ్ పరీక్షల సంఖ్యను పెంచడం అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.భారత్ కేవలం 0.5 శాతం జనాభాకు మాత్రమే పరీక్షలు నిర్వహించిందన్నారు. వ్యాధి నిర్ధారణకు ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్లపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయం వెతకాల్సిన అవసరం ఉందన్నారు. లక్షణాలు గుర్తించేందుకు ఉష్ణోగ్రత పరిశీలించడం, ఆక్సిజన్ చెక్ చేయడం, కాంటాక్టులను గుర్తించడం అత్యవసరమన్నారు. మరోవైపు లాక్డౌన్ వల్ల ఇతర దేశాల్లో కరోనా కేసులు తగ్గితే, దురదృష్టవశాత్తూ భారత్లో మాత్రం అలా జరగలేదన్నారు. మనం వైరస్ వ్యాప్తిని మందగించేలా చేశాం కానీ నిర్మూలించలేదన్నారు. అయితే న్యూజిలాండ్ లాగా భారత్ కరోనాను పూర్తిగా నియంత్రించలేకపోవచ్చని భ్రమర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.