ఈ తెల్లవారు ఝామున పాకిస్తాన్, భారత్ బలగాల మధ్య 3గంటలపాటు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో భారత జవాను మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్లో పాక్ కాల్పుల్లో ఆర్మీ జవాను అమరుడయ్యారు. కృష్ణఘాటి, నౌషెరా సెక్టార్లో పాక్ బలగాలు భారీగా కాల్పులకు పాల్పడ్డాయి. పాక్ కవ్వింపు చర్యలకు భద్రతాబలగాలు దీటుగా బదులిచ్చాయి. సరిహద్దుల వెంట తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తోంది. ఈ నెలలో పాక్ బలగాల కాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అనంత్నాగ్ జిల్లా కాప్రాన్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.