నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ జరుపుకుంటున్న వేళ, తన ఇంట్లోనే ఓ విచిత్నమైన ఆసనాన్ని వేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది. మోకాళ్ల కిందకు తన చేతులను పెట్టి, కూర్చుని, పాదాల సాయంతోనే అటూ ఇటూ సెహ్వాగ్ నడిచారు. వాస్తవానికి ఇలా చేయడం చాలా కష్టం. దీన్ని చేసేందుకు సెహ్వాగ్ ఎంత కష్టపడ్డాడో తెలియదుగానీ, "దీన్ని యోగా అని ఇప్పటికి కచ్చితంగా చెప్పలేను. దానికి కొంత సమయం పడుతుంది" అని సెహ్వాగ్ తన వీడియోకు కామెంట్ పెట్టారు. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్, ఈ ఆసనం పేరు తమకు తెలియదని, సెహ్వాగే చెప్పాలని అంటున్నారు. మరికొందరు సెహ్వాగ్ పడ్డ కష్టానికి జోహార్లు చెబుతున్నారు.