సరిహద్దుల్లో చైనా సైనికుల దాడి తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ తీవ్రంగా పెరుగుతోంది. చైనా వస్తువులకు, చైనా యాప్స్ కు అతిపెద్ద మార్కెట్ గా ఇండియా ఉంది. చైనా వస్తువులను ఇండియా బహిష్కరిస్తే ఆ దేశానికీ ఆర్ధికంగా చాలా నష్టం వస్తుంది. చైనాలో తయారయ్యే ప్రతి వస్తువు ఇండియాకు దిగుమతి చేస్తుంటారు. ఇండియాలో తయారయ్యే వస్తువుల కంటే చైనా వస్తువులు చీప్ గా మార్కెట్లో దొరుకుతుండటంతో వాటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. చైనాతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశం నుంచి సాధ్యమనంత మేర దిగుమతులు తగ్గించడానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.చైనా వస్తువులను నిషేదించాలనే నేపథ్యంలో "లోకల్ యాప్" సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 20 వేల మంది వరకూ పాల్గొన్నారు. భారత్ లో చైనా ఉత్పత్తులు, యాప్ లపై నిషేధం విధించాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా 95.11 శాతం మంది చైనా వస్తువులను నిషేదించాలని కోరారు. ఇక 4.96 శాతం మంది చైనా వస్తువులను నిషేదించకూడదని సర్వేలో తెలిపారు.భారతసైన్యంపై చైనా దాడిచేసిన నేపథ్యంలో చైనాకు గుణపాఠం చెప్పాలని దేశంలోని వ్యాపారులంతా నిర్ణయించారు. చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) సిద్ధమయ్యింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించడానికి, భారతీయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి క్యాట్ ఇండియన్ గూడ్స్ - అవర్ ప్రైడ్స అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ముందుగా చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసింది. వీటిని బహిష్కరించాలని నిర్ణయించింది. అధికారిక వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. దాదాపు 371 వస్తువుల దిగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించనున్నారు. దాదాపు 127 బిలియన్ల విలువైన ప్లాస్టిక్ వస్తువులు, స్పోర్ట్స్, ఫర్నీచర్ వస్తువులు సైతం ఇందులో ఉన్నాయి.ఒకేసారి అన్ని రకాల వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాదు. దశలవారీగా వాటిపై నిషేధం విధించే అవకాశం ఉన్నది. చైనా మొబైల్ ఫోన్లు, యాప్ లు ఇండియాలో బాగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా టిక్ టాక్ యాప్ బాగా పాపులర్ అయ్యింది. చైనా యాప్ లను బహిష్కరిస్తే, టిక్ టాక్ పై కూడా నిషేధం విధించాలి. చైనా ఫోన్లపై కూడా నిషేధం విధించాలి. వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే అత్యధిక 100 రకాల వస్తువులపై టాక్స్ ను భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ కరోనా సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సప్లై, చైన్ మెకానిజంపై ఆ ప్రభావం పడి దిగుమతి చేసుకునే వారు భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. చైనాను ఎదుర్కోవాలి అంటే ముందుగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టాలి. మనం తయారు చేసుకునే వస్తువులను మనమే వినియోగించుకోగలిగితే, విదేశీ వస్తువులను చాలా వరకు తగ్గించుకోవచ్చు.సగటు భారతీయుడు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వారికి తెలియకుండా చాలా చైనీస్ వస్తువులను ఉపయోగిస్తాడు. గత ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 2019 వరకు ఇరు దేశాల మధ్య వాణిజ్యం రూ. 6.7 లక్షల డాలర్లు. అందులో కేవలం చైనా నుంచి భారత్కు వస్తున్న ఎగుమతుల విలువే దాదాపు 5.7 లక్షల కోట్లు. అంటే మన దేశం నుంచి చైనాకు చేస్తున్న ఎగుమతులు విలువ కేవలం రూ. లక్ష కోట్లు మాత్రమే. అంటే దాదాపు ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు దాదాపు 3.75 లక్షల కోట్లు గా ఉంది. దీన్ని బట్టి దేశీయ మార్కెట్లు చైనా వస్తువులతో ఎలా నిండిపోయాయో ఊహించవచ్చు.
చైనా నుంచి భారీగా దిగుమతి చేసుకునే వస్తువులు..ఒకసారి చూస్తే..(బిలియన్లలో)
యంత్రాలు, యంత్ర పరికరాలు(12.78)
ఆర్గానిక్ కెమికల్స్(7.53)
మొబైల్ ఫోన్లు, పరికరాలు(5.18)
ఎలక్ట్రానికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు(3.2)
కంప్యూటర్, పరికరాలు(3.04)
ఫెర్టిలైజర్(1.80)
సోలార్ సెల్ లు, సెమీ కండక్టర్లు(1.57)
ఇనుము, స్టీల్ వస్తువులు(1.08)
చైనాకు మనం భారీగా చేసే ఎగుమతులు చూసినట్లయితే..(బిలియన్లలో)
ఆర్గానిక్ కెమికల్స్(2.57)
ప్రాసెస్ చేసిన పెట్రోలీయం(2.05)
ఇనుప ధాతువు(1.90)
రొయ్యలు(0.84)
ప్లాస్టిక్, ప్లాస్టిక్ వస్తువులు(0.81)
ఎలక్ట్రికల్ వస్తువులు(0.79)
మిషనరీ(0.73)
కాటన్(0.72)
ఐరన్, స్టీల్(0.49)
గ్రానైట్(0.39)
భారతదేశంలో మొదట్లో, సాధారణ యంత్ర వస్తువులు జర్మనీ, ఫ్రాన్స్ మరియు యూరోపియన్ దేశాల నుండి వస్తాయి, కాని ఇప్పుడు అవి ఎక్కువగా చైనా నుండి వస్తున్నాయి. ఇందులో అన్ని రకాల యంత్రాలు, యంత్ర ఉపకరణాలు, రైల్వే, అణు రియాక్టర్లలో వాడే పరికరాలు, బాయిలర్లు, విద్యుత్ ఉత్పత్తి పరికరాలు, యంత్ర భాగాలు ఉన్నాయి. దీపావళి, వినాయక చవితి, హోలీ ఇలా ఏ సందర్భాన్ని చైనీయులు వదులుకోవడం లేదు. లక్ష్మీ, గణేశ ప్రతిమలు, హోలీ రంగుల వరకు ప్రతిదీ ఇప్పుడు చైనా నుండి వస్తోంది. అంతేకాదు మన దేశీయ పరిశ్రమలు చైనా నుండి భారీ యంత్రాలను ఆర్డర్ చేస్తున్నాయి. గడిచిన రెండు దశాబ్దాలలో, భారతదేశంలో పరిశ్రమల మూసివేత ఎక్కువగా ఉంది. ఇది చైనీయులకు లాభదాయకంగా మారింది. కాబట్టి చైనీయుల వస్తువులను వాడకుండా ఉందాం.. మన దేశంలో తయారైన వస్తువులనే ఉపయోగించుకుందాం. మన దేశానికి అభివృద్ధి బాటలు వేద్దాం.