దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు వారాలుగా పెరుగుతూనే వస్తున్నాయి. శనివారం కూడా దేశీ ఇంధన ధరలు పైకి కదిలాయి. మరోవైపు క్రూడ్ ధరలు పెరిగాయి. రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారని సామాన్యుల కష్టాలు తప్పవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 51 పైసలు పెరుగుదలతో రూ.82.27కు చేరింది. డీజిల్ ధర కూడా 57 పైసలు పెరుగుదలతో రూ.76.30కు ఎగసింది. వాహనదారులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి చమురు ధరలు. అసలే కరోనా కష్టకాలంలో.. ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయన్నారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రజలకు ఈ పెరిగిన పెట్రోల్ ధరలతో మరింత ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్ ధరలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పెంచిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.