కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో వివిధ మార్గాల్లో ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే, కొందరు సంపన్నులు తమ పెంపుడు జంతువులను బాగా మిస్సవుతున్నామని తెగ బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తమతో తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రిషన్ ఏవియేషన్ అనే ఓ ప్రైవేట్ జెట్ సంస్థ కేవలం పెంపుడు జంతువుల కోసమే విమానం నడిపేందుకు సిద్ధమైంది.పెంపుడు కుక్కలకు దూరంగా ఉన్నామని బాధపడే యజమానుల బాధను తీర్చే ఉద్దేశంతో సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్ అక్రియషన్ ఏవియేషన్ను సంప్రదించింది. ఇందుకు ఆ విమానయాన సంస్థ కూడా సిద్ధమవడంతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. కేవలం ఆరు పెంపుడు జంతువులు మాత్రమే ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. విమానానికి చెల్లించాల్సిన మొత్తం అద్దె రూ.9.60 లక్షలు కాగా ఒక్కో సీటుకు రూ.1.60 లక్షల ధర నిర్ణయించారు. ఈ విమానంలో ఇప్పటికే నాలుగు సీట్లను కొందరు బుక్ చేసుకున్నారు. ఇంకో రెండు సీట్లు బుక్ కావాల్సి ఉంది. మొదటి దశలో ఢిల్లీ నుంచి ముంబయికి ఈ విమానాన్ని నడుపుతారు.