ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో శుక్రవారం ఉదయం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్కు ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు. శాసనసభలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. పోలింగ్లో పాల్గొనే సభ్యుల సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టీ మొత్తం నాలుగు స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది.
వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ తరపున మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్ బూత్లో కూర్చున్నారు. ఎన్నికల బరిలో అధికార పార్టీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు బరిలో ఉన్నారు. ఇక సభలో సరైన సంఖ్యా బలం లేకున్నా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు
మరోవైపు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు సీట్లకు, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో మూడు సీట్లకు, జార్ఖండ్ నుంచి రెండు సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు ఎన్నిక జరగనున్నది. రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటులో బీజేపీ-కాంగ్రెస్ మధ్య చాలా గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.