నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో మనుషులకు ప్రశాంతత అనేదే లేకుండా పోయింది. నిత్యం ఒత్తిళ్లలో పనిచేస్తూ చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. అయితే, ఇలాంటి సమస్యలు వివిధ నగరాలు, పట్టణాల్లోని సరస్సులు కొంతమేరకైనా ఉపశమనం కలిగిస్తున్నాయి. అందుకే దేశంలోని పలు రాష్ట్రాల్లో సరస్సులు పర్యాటక ప్రదేశాలుగా విలసిల్లుతున్నాయి.
జమ్ముకశ్మీర్లోని దాల్, నగీన్ సరస్సులు దేశంలో ఎంతో ప్రాముఖ్యత గల సరస్సులు. ప్రస్తుతం ఆ సరస్సులలో భారీగా గుర్రపు డెక్క, ఇతర చెత్తా చెదారం పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు దాల్, నగీన్ సరస్సుల క్లీనింగ్కు శ్రీకారం చుట్టారు. ఈ సరస్సుల క్లీనింగ్ కోసం గత కొన్ని రోజులుగా నిత్యం వెయ్యిమంది కూలీలు పనిచేస్తున్నారని జమ్ముకశ్మీర్ లేక్స్ అండ్ వాటర్ వేస్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన అధికారి షబ్బీర్ హుస్సేన్ చెప్పారు.