థాయిలాండ్లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సీఎన్ఎన్ కథనం మేరకు.. అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు తమ కస్టమర్లకు ఓ అద్భుత ఆఫర్ అంటూ భారీ ఎత్తున డిస్కౌంట్ ఓచర్లను ఇచ్చాయి. ఆ వోచర్లను తీసుకొస్తే భారీ డిస్కౌంట్లు ఇస్తామని ప్రకటించాయి. సీ ఫుడ్ మీద అంటే పడిచచ్చే థాయిలాండ్ వాసులు ఆ వోచర్లను కొనుగోలు చేశారు. బఫెట్లో ఫుల్లుగా తినొచ్చని ఆఫర్ ఇవ్వడంతో పంట పండిందనుకున్నారు. వోచర్లు పొందిన వారంతా రెస్టారెంట్లకు వెళితే ఆ వోచర్లు చెల్లవంటూ రెస్టారెంట్ యజమానులు చేతులెత్తేశారు. దీంతో కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 సెప్టెంబర్లో రెండు రెస్టారెంట్ల ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి స్థానిక కోర్టులో విచారణ జరిగింది. మొదట వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, తాము చేసింది తప్పేనంటూ రెస్టారెంట్ల యజమానులు తమ తప్పు ఒప్పుకోవడంతో వారి శిక్షను సగానికి అంటే 723 సంవత్సరాలకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అలాగే, 58,500 డాలర్ల జరిమానా విధించింది. అయితే, థాయిలాండ్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు విడుదల కావొచ్చు.