సున్నాపురాయి క్వారీలో జరిగిన ఘోర ప్రమాదం ఆరుగురిని బలిగొంది. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ పస్గరిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం పస్గరి ఏరియా, పప్రేడీ గ్రామంలోని ఓ సున్నాపురాయి క్వారీలో 20 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సున్నపురాయి తవ్వుతుండగా పెళ్లలు పెద్ద మొత్తంలో విరిగి కూలీలపై పడ్డాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రగాయాలపాలైన మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చావుబతుకులతో పోరాడుతున్నారు. మిగిలిన 10 మంది ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా ఉన్నారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే క్వారీ మూసేయాలని ఆదేశించారు. మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది.