దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు తెరచుకున్నాయి. దీంతో భక్తులు స్వల్ప సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు. అయ్యప్ప స్వామి ఆలయం కూడా త్వరలోనే తెరుచుకుంటుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ తంత్రి కందరారు మహేశ్ మనోహరు తో ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ ప్రెసిడెంట్, ఇతర అధికారులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. జూన్ 19 నుంచి నిర్వహించాల్సిన శబరిమల వార్షిక ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని పేర్కొంది. ‘‘శబరిమల తంత్రి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. నెలవారీ పూజ, ఆలయ పండుగలను కూడా రద్దు చేశాం’’ అని సురేంద్రన్ తెలిపారు. తాజాగా భక్తుల కోసం శబరిమల ఆలయాన్ని తెరవబోవడం లేదని కేరళ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. అలాగే, నెలవారీ పూజ, పండుగను కూడా వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. కాగా, శబరిమల ఆలయాన్ని ఈ నెల 14న సాయంత్రం నెలపూజ కోసం తెరుస్తామని, 19న ఆలయ పండుగ ప్రారంభం అవుతుందని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు బుధవారం తెలిపిన సంగతి తెలిసిందే. అంతలోనే బోర్డు నిర్ణయం తెలుపడంతో వాటిని రద్దు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.