ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెస్టిండీస్ జట్టుకి కరోనా టెస్టులు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 02:54 PM

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్ సిరీస్‌లు మళ్లీ ప్రారంభానికి నోచుకోబోతున్నాయి. గతానికి భిన్నంగా పటిష్ట జాగ్రత్తలతో ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు ఇంగ్లండ్‌ ఆతిథ్యమివ్వబోతున్నది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (జీవ రక్షణకు అనుకూలమైన వాతావరణం)లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఇంగ్లండ్‌ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సిద్ధమైంది.


టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌ వెళ్లనున్న వెస్టిండీస్ జట్టుకి సోమవారం కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. ఆటగాళ్లతో పాటు జట్టు సిబ్బంది అందరికి కరోనా నెగటివ్ అని తేలింది. జులై 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుండగా.. కనీసం మూడు వారాల ముందు విండీస్ జట్టును పంపాలని ఈసీబీ సూచించింది. దాంతో గతవారం 14 మందితో కూడిన జట్టుని ప్రకటించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు.. ప్రయాణానికి ముందు వారికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. ఆపై సాయత్రం రెండు చార్టెడ్‌ విమానాల్లో జట్టు బయలుదేరింది.


 


'వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా విమానాశ్రయానికి వివిధ ప్రాంతాల నుంచి క్రికెటర్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది చేరుకున్నారు. అక్కడ వారికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అందరికీ నెగటివ్ వచ్చింది. అనంతరం ఇంగ్లండ్‌కి జట్టు బయదేరింది. జట్టు మంగళవారం మాంచెస్టర్‌కి చేరుకుంటుంది. అక్కడ మళ్లీ కరోనా టెస్టులు నిర్వహిస్తారు' అని విండీస్ బోర్డు ప్రకటించింది. 'ఈ సిరీస్ కోసం మేము ఇంగ్లాండ్ వెళ్లడం చాలా పెద్ద ముందడుగు. ఆటలో కొత్త మార్పు ఏమిటనే దాని కోసం చాలా సన్నాహాలు జరిగాయి' అని కెప్టెన్ జాసన్ హోల్డర్ అన్నాడు.


 


మూడు టెస్టుల సిరీస్ పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. ఇందుకోసం ఈసీబీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంగ్లండ్ గడ్డపైకి అడుగుపెట్టిన తర్వాత 14 రోజుల పాటు విండీస్ జట్టు క్వారంటైన్‌లో ఉండనుంది. జులై 8 నుంచి 12 వరకూ హోంప్‌షైర్‌లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. జులై 16 నుంచి 20 మధ్య రెండో టెస్టు, 24 నుంచి 28 వరకూ మూడో టెస్టు మ్యాచ్‌ మాంచెస్టర్ వేదికగా జరగనున్నాయి. వైరస్ భయంతో సిమ్రాన్ హిట్‌మెయర్, కీమో పాల్, డారెన్ బ్రావో ఈ పర్యటనకి దూరంగా ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com