మనదేశంలో గంగానదిని పవిత్రంగా భావిస్తారు. జనన, మరణ సమయాలలో గంగాజలాన్ని వారిపై చల్లితే పుణ్యులు అవుతారనే నమ్మకం ఉంది. పాపం చేసినవారు గంగాజలాన్ని సేవిస్తే వారికీ మోక్షం లభిస్తుందని అంటుంటారు. అయితే గంగాజలాన్ని ఎన్ని రోజులు నిల్వచేసినా పాడవకుండా స్వచ్ఛంగా ఎందుకుంటుంది. అలాగే గంగానది గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.... ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమనీనదంలో భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ఆ ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగ అంటారు. గంగా నది మొత్తం పొడవు సుమారు 2,510 కి.మీ. పురాణానికి వస్తే, నిరాకారియైన గంగ బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది. ఒకసారి శంకరుడు ఆలపించిన రాగానికి నారాయణుడు పరవశించిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి పాదాల నుంచి ద్రవీభవించిన జలాన్ని బ్రహ్మదేవుడు తన కమండలానికి తాకించగా నిరాకార గంగ జలంగా మారింది. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడై ముల్లోకాలను కొలిచినపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఆ నీటితోనే విష్ణుపాదాలను కడిగాడు. ఆ పాదము నుంచి ప్రవహించినదే పవిత్రమైన గంగ. గంగానది 2510 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తుంది. దేవతలు సైతం గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంగానదిలో స్నానమాచరించడం వల్ల చేసిన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందనే నమ్మకం. మరణానంతరం అస్తికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల ప్రగాఢ విశ్వాసం. గంగానదిలో మునక వల్ల అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు పితృదేవతలు తరిస్తారట. గంగానది నీరు ఎన్ని రోజులు నిల్వఉంచినా పాడవకుండా స్వచ్చంగా ఉండటానికి పరిశోధకులు కొన్ని కారణాలు తెలిపారు. బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ గంగానదిలో ఉంటుంది. ఇది గంగానదిలోకి వచ్చే ఇతర హానికర బ్యాక్టీరియాలను చంపేస్తుంది. అంతేకాకుండా హిమాలయాలలో ప్రవహించేటప్పుడు, గంగానదిలోకి వేడినీటి బుగ్గలనుంచి వస్తున్న జలపాతాలు వచ్చి కలుస్తాయి. అందులోని సల్ఫర్ గంగానదిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది. అందుకే గంగానది నీరు అంత స్వచ్చంగా ఉంటుందని శాస్త్రీయ ఆధారాలు తెలియజేస్తున్నాయి.