అదో పెద్ద జైలు. ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు ఉండేవారు. ఇప్పుడు ఖైదీలకు బదులు దెయ్యాలు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఆ జైలును నిషేదిత ప్రాంతంగా ప్రకటించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ జైలు పరిసరాల్లో గానీ, లోపల గానీ అడుగు పెట్టకూడదు. బ్రిటన్ లోని సోమర్సెట్ ప్రాంతంలో షెప్టన్ మాలెట్ జైలు ఉంది. ఇక్కడ వందలాది మంది ఖైదీలను ఉరి తీశారు. ముఖ్యంగా తూర్పు లండన్లో 1950 నుంచి 1960 వరకు నేర సామ్రాజ్యాన్ని నడిపిన రోనాల్డ్ అలియాస్ రొన్నీ, క్రే రెజినాల్డ్ అలియాస్ రెగ్గీ, అతడి అనుచరులకు ఈ జైలులోనే ఉరిశిక్ష అమలు చేశారు. దీంతో వారే చెడు ఆత్మలుగా మారి తిరుగుతున్నారని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. పురాతనమైన ఈ జైలు చాలా ఏళ్లు ఉనికిలో ఉంది. అయితే, ఇందులో వింత వింత శబ్దాలు వినిపించేవని, జైలు గదుల్లో ఎవరూ లేకున్నా కటకటాలు వాటికవే తెరుచుకుని.. మూసుకొనేవని, ఆత్మలు సంచరిస్తుండేవని ఖైదీలు చెబుతుండేవారు. దీంతో ఈ జైలును 2013లో మూసివేసి, నిషేదిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే, జైలు శిథిలావస్థకు చేరడం వల్లే ఈ జైలును మూసివేశామని ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన ఆత్మల పరిశోధకులు ఈ జైల్లో కొన్ని వింత శబ్దాలు రికార్డు చేశామని, ఆత్మలు కూడా కనిపించాయని చెప్పారు. జైలు కారిడార్లో అడుగుల శబ్దాలు కూడా వినిపించేవని, ఇక్కడికి ఒంటరిగా వెళ్లడం చాలా ప్రమాదకరమని తేల్చారు. కానీ ఇవన్నీ నిరాధారమని కొందరు కొట్టిపడేసారు. ఈ మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉంది.