ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికన్ రచయిత్రిపై పాక్ మాజీ మంత్రి అత్యాచారం

international |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 01:36 PM

పాకిస్తాన్ మాజీ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత రెహ్మాన్ మాలిక్‌ పై అమెరికా రచయిత్రి సింథియా డి రిచీ సంచలన ఆరోపణలు చేశారు. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆమె ఈ ఆరోపణలు చేయడంతో ఇది వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రిగా ఉండగా ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా వెల్లడించారు.


ఓ దశలో పాక్ మాజీ అధ్యక్షుడితో పాటుమరో  మాజీ మంత్రిపై కూడా ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్‌ షాహబుద్దీన్‌ కూడా ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో లైంగికంగా వేధించారని చెప్పింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ చేస్తూ మోసం చేస్తారని సింథియా ఆపేర్కొన్నారు. గత వారమే ఈమె మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో వైవాహిక జీవితాలను బయటపెట్టారు. ‘ఇన్‌డీసెంట్‌ కరస్పాండెంట్‌ సీక్రెట్‌ సెక్స్‌ లైఫ్‌ ఆప్‌ బెనజీర్‌ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  దీంతో ఆమెపై ఆ పార్టీ నేతలు సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేశారు. 


కాగా సింథియా 2009లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్‌ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఈ ఆరోపణలు పాక్ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com