అమిత్ షా నేతృత్వంలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంఫాన్ తుఫాను తరువాత పశ్చిమ బెంగాల్లో వారు చేస్తున్న సహాయక చర్యల వీడియోలు మరియు ఫోటోలు పంచుకుంటున్నారు. అయితే, గురువారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తి తన పర్సనల్ ఫోటోను షేర్ చేసేశాడు. తన సొంత ఇంటి వ్యవహారాలకు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. అప్పటి నుంచి ఆ ఫోటో వైరల్ అయ్యింది. ఫేస్ బుక్ లో పోస్టులల్లో రాయల్ స్టాగ్ విస్కీ బాటిల్ ను ఆ వ్యక్తి పోస్టు చేశాడు. దీంతో అర్థం పూర్తిగా మారిపోయినట్లు అయ్యింది. సహాయక చర్యల్లో మందు బాటిళ్లు ప్రత్యక్షమవ్వడంతో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి అలా చేయడం వల్ల నెటిజన్లు చాలా మంది తిట్టిపోశారు. హోం మంత్రిత్వ శాఖకు విషయం తెలిసి పోస్ట్ ను తొలగించింది. "అనుకోకుండా చేసిన తప్పు" అని సమర్థించింది. ఆ తర్వాత ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. సదరు వ్యక్తి పెట్టిన పోస్టును చూసిన తరువాత, నెటిజన్లు నిరాశకు గురయ్యారు. ఫోటోను చూసిన చాలామంది ఆ వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. వ్యక్తికి జరిమానా విధించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు.