కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అల్లాడుతుంటే. ఆ మహమ్మారిపై సెటెర్లు వేసి ఇండోనేషియాకు చెందిన ఓ మంత్రిపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇండోనేషియా భద్రతా మంత్రి మహ్మద్ మహ్ఫూద్ ఎండీ లాక్డౌన్ సడలింపులపై ప్రజల్లో భయాన్ని తొలగిస్తూ వారికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేలా ఉపన్యాసం ఇచ్చారు. కరోనా వైరస్ తిరుగుబాటు వ్యక్తిత్వం కలిగిన భార్య లాంటిదని అన్నారు. మన ఆరోగ్యం పట్ల అన్ని శ్రద్ధలు తీసుకునే దేశంలో లాక్డౌన్ను ఎత్తేయబోతున్నామన్న మహ్ఫూద్, తన సహోద్యోగి పంపిన మీమ్ గురించి ప్రస్తావించారు. కరోనా మీ భార్య లాంటిది.. మొదట్లో మీరు ఆమెను కంట్రోల్ చేయాలని అనుకుంటారు. అయితే అది తనవల్ల కాదని తర్వాత తెలుసుకుంటారు. ఇక చేసేదేమీ లేక సహజీవనం ప్రారంభిస్తారు అని ఆ మీమ్ సారాంశాన్ని తెలియజేశారు. అయితే.. అక్కడితో ఆగకుండా ప్రస్తుతం దేశంలో, ప్రపంచంలో అలాంటి పరిస్ధితే ఉందని మహ్ఫూద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఆయనపై మహిళా సంఘాలు ఇప్పుడు సోషల్ మీడియాలో మండిపడుతున్నాయి.