అన్ని కాలవ్యవధుల రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు నిన్నటి నుంచే ఆచరణలోకి వచ్చాయి. ఈ భారీ తగ్గింపుతో 1-2 సంవత్సరాల ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీ 5.1 శాతం, 3 -5 ఏళ్ల డిపాజిట్లపై 5.3 శాతం, 10 ఏళ్ల వరకైతే 5.4 శాతం వడ్డీని ఖాతాదారులు ఆర్జించనున్నారు. ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీరేటును మే నెలలో వరుసగా రెండవ సారి తగ్గించడం గమనార్హం. మే నెలలో ఇదివరకు కోతలో భాగంగా ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీని 20 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. మే 12, 2020 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించినప్పటికీ వయోవృద్ధుల కోసం ప్రత్యేక పథకాన్ని ఎస్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.