మున్సిపల్ శాఖపై గళమెత్తారు అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ప్రత్యేకించి ఇంజినీరింగ్ విభాగం.. అదుపు తప్పిందనే సంచలన ఆరోపణలు గుప్పించారు. రాజకీయాల్లో తలపండిన బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న శాఖ అది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో వైద్య, ఆరోగ్యం, పోలీసులతో సమానంగా మున్సిపల్ శాఖ కృషి చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ శాఖను కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన అధికార పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే లక్ష్యంగా చేసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది.మున్సిపల్ శాఖలో సమూల మార్పులను తీసుకుని రావాల్సిన సమయం ఆసన్నమైందని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖలో ఇంజినీరింగ్ విభాగం ఎందుకు పనిచేస్తోందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, దాన్ని పట్టాలెక్కించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఇస్తోన్న ప్రాధాన్యత కంటే.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి, వారికి కల్పించాల్సిన ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్రక్షాళన ఏదో తన నియోజకవర్గం నుంచే ఆరంభించాల్సి ఉంటుందని చెప్పారు.
పట్టణ స్థాయిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసిందని, అయినప్పటికీ.. ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి మురిగిపోతున్నాయని విమర్శించారు. మంచినీటి కుళాయిల కనెక్షన్లు సహా వాటి మరమ్మతులను పట్టించుకోవట్లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆ విభాగం అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం లేకపోలేదని అన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీపై రాజకీయ నాయకుల పెత్తనం మితిమీరిందని ఆయన పరోక్షంగా మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వర్గాన్ని ఉద్దేశించి విమర్శించారు.