ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంచలన నిర్ణయం తీసుకున్న సౌదీ ప్రభుత్వం...

international |  Suryaa Desk  | Published : Mon, Apr 27, 2020, 12:12 PM

సౌదీ అరేబియాలో ఏదైనా తప్పు చేస్తే ఆ దేశంలో కఠిన శిక్షలు విధిస్తారు. తప్పు చేయాలంటే భయపడేలా ఉంటాయి ఆ శిక్షలు. అందులో అతి ముఖ్యమైనవి బహిరంగ ఉరి శిక్ష, కొరడా దెబ్బలు. అయితే, సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకొంటూ వార్తల్లో నిలుస్తోంది. మొన్నకి మొన్న కొరడా దెబ్బలను రద్దు చేసిన సౌదీ సర్కారు.. తాజాగా చిన్న పిల్లలు తప్పుచేస్తే విధించే మరణ శిక్షను రద్దు చేసింది. మైనర్లు నేరానికి పాల్పడితే వాళ్లకు ఇక నుంచి మరణ శిక్ష ఉండదు. దీనిపై మానవ హక్కుల కమిషన్ ప్రెసిడెంట్ అవాద్ అల్వాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ విజన్ 2030లో భాగంగా దేశంలోని అన్ని రంగాలలో కీలక సంస్కరణలను రూపొందించేందుకు దేశ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రిన్స్ ముహ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా వీటన్నింటిని పర్యవేక్షిస్తున్నారు. కొత్త శిక్షాస్మృతిని స్థాపించడంలో తాజా నిర్ణయం దోహదం చేస్తుంది. త్వరలోనే మరిన్ని సంస్కరణలు అమల్లోకి వస్తాయి’ అని వెల్లడించారు.


కాగా, ఉరి శిక్షను రద్దు చేసే ఆలోచన చేయాలని గత ఏడాది సౌదీ అరేబియాను ఐక్యరాజ్యసమితి కోరింది. పలు మానవ హక్కుల సంఘాలు కూడా మరణ శిక్షపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సౌదీ రాజు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. 2019లో సౌదీ 189 మందిని ఉరి తీసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 12 మందిని ఉరి తీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com