ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్...

national |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 01:33 PM

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ముందుగా ఆయన ఈ-గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌, మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. ముందుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడంపై చర్చించారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న సర్పంచ్‌లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలతో పురస్కారాలు అందుకున్న వారికి అభినందనలు తెలియజేశారు. కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే ముఖ్యమని అన్నారు. ప్రజలు బయటికి రాకుండా కరోనాను కట్టడి చేయాలని చెప్పారు. ఆ మహమ్మారి మన జీవితాలను దెబ్బతీసిందని, ఒకప్పుడు ఎదురెదురుగా మాట్లాడుకునే మనం ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవాల్సి వస్తోందని అన్నారు.గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యుత్తు, రోడ్లు పారిశుధ్యంపై చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు మోదీ. ఈ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనేే గ్రామం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. లక్షకు పైగా పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం అయ్యాయని గుర్తు చేశారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అటు.. ప్రధానితో పలువురు సర్పంచ్‌లు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com