ఒక్కటి కాదు.. రెండు కాదు.. మొత్తం 50 కాకులు, మరో మూడు కుక్కలు.. ఒకేసారి మృతి చెందాయి. కుప్పలు తెప్పలుగా కాకుల శవాలు పడి ఉన్నాయి. ఈ దారుణ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్లో గురువారం చోటుచేసుకుంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కాకులు, కుక్కలు మృతి చెందడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న వెటర్నరీ డాక్టర్లు, పోలీసులు నమూనాలు సేకరిస్తున్నారు. ఎవరైనా విషాహారం పెట్టారా? లేక.. వేరే కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.కాగా, అమెరికాలో రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్ రావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. పెంపుడు జంతువులకు కరోనా రాదని అనుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అదే సమయంలో కాకులు, కుక్కలు మృతి చెందడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.