జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు, సీఈవో రుద్రతేజ్ సింగ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మరణంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇండియాలో మార్కెట్ ను మరింత బలోపేతం చేస్తున్న తరుణంలో ఆయన లోటు పూడ్చలేనిదని తెలిపింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.యూపీకి చెందిన రుద్రతేజ్ సింగ్ ఒక సామాన్యుడి స్థాయి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగారు. ఆయన కెరీర్ ఒక చిన్న ఏరియా సేల్స్ మేనేజర్ గా ప్రారంభమైంది. 1996లో సేల్స్ మేనేజర్ గా ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు. బీఎండబ్ల్యూలో కంటే ముందు రాయల్ ఎన్ ఫీల్డ్ లో పని చేశారు. ఆ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ అనేక ఉన్నత పదవులను చేపట్టారు. 2019 ఆగస్టు 1న బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్, సీఈవోగా బాధ్యతలను చేపట్టారు. రుద్రతేజ్ సింగ్ వయసు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే.