కరోనా వైరస్ వల్ల దాదాపు అన్ని దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ప్రజలు అనేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ ఇప్పుడు భార్యభర్తలు, కుటుంబాల మధ్య కలహాలకే కాకుండా హత్యలకు కూడా దారితీస్తుందనే ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర లండన్లోని ఎడ్మాంటన్లో నివసిస్తున్న హుస్సేయిన్ ఎగాల్ (65) తన భార్య మార్యన్ (57) దారుణంగా కొట్టి చంపాడు. పొరిగింటివాళ్లకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎగాల్ ఇంటికి చేరిన పోలీసులు రక్తపు మడుగులో పడివున్న మార్యన్ కనిపించింది. దీంతో పోలీసులు ఎగాల్ను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. తన భార్యను ఎందుకు చంపావని ప్రశ్నించిన పోలీసులకు అతడు షాకింగ్ వివరాలు చెప్పాడు. తాను కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపాడు. ఆ వైరస్ సోకుతుందనే భయంతో భార్య మార్యన్ తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరిందన్నాడు. దీంతో కోపం వచ్చి ఆమెను కొట్టి చంపేశానని తెలిపాడు. ఎగాల్ తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు అతడి శాంపిళ్లను వైద్య పరీక్షల కోసం పంపించారు. రిపోర్టుల్లో అతడికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును జూన్ 14కు వాయిదా వేశారు.