ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. గతంలో కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది తానేనని రమేష్ కుమార్ ప్రకటించారు. జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తూ తనకు భద్రత కల్పించాలని రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అయితే ఈ లేఖను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, టీడీపీ నేత వర్ల రామయ్య ఫోర్జరీ చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. విజయసాయిరెడ్డి లేఖ రాసిన కాసేపటికే రమేష్ కుమార్ ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో తాను లేఖ రాశానని, దీని పై థర్డ్ పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దీని పై వివాదం అనవసరం అంటూ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు.