కరోనా వైరస్ ప్రభావంతో భారత్ లో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో సడలింపులనిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో బ్యాంకులు కూడా ఉన్నాయి. బ్యాంకులకు సంబంధించిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి.
- బ్యాంకు బ్రాంచ్లు సాధారణ పనివేళల్లో తెరిచి ఉండేందుకు అనుమతి లభించింది. అయితే ఇది నగదు బదిలీ పూర్తయ్యేవరకు మాత్రమేనని హోం శాఖ స్పష్టంగా తెలియజేసింది.
- బ్యాంకు బ్రాంచ్లు, ఏటీఎంలు, బ్యాంకు నిర్వహణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించేవారు, బ్యాంక్ కరస్పాండెంట్స్, ఏటీఎం నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ ఏజెన్సీలకు ఎంపిక చేసిన కార్యకలాపాలు నిర్వహించడానికి మాత్రమే అనుమతి ఉంది.
- బ్యాంకులు, ఏటీఎంల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా స్థానిక అధికార యంత్రాంగం సెక్యూరిటీ కల్పించాలని హోం శాఖ ఆదేశించింది.
- ఆర్థిక రంగంలో బ్యాంకులు, ఏటీఎంలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI, సెబీ నోటిఫై చేసిన క్యాపిటల్, డెట్ మార్కెట్లు, ఐఆర్డీఏఐ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఎన్పీసీఐ, సీసీఐఎల్, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కార్యకలాపాలు సాగిస్తాయి.
- అయితే సవరించిన ఈ గైడ్లైన్స్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా అధికారులు గుర్తించిన కంటైన్మెంట్ జోన్లల్లో వర్తించవు.
- ఒకవేళ కంటైన్మెంట్ జోన్గా ఏదైనా కొత్త ప్రాంతాన్ని గుర్తిస్తే ఆ ప్రాంతంలో సవరించిన గైడ్లైన్స్ అన్నీ రద్దవుతాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన గైడ్లైన్స్ తక్షణం అమలులోకి వస్తాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.