రోజు రోజుకి ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఒక్కటే ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ను ప్రభుత్వం ఓ వైపు పక్కాగా అమలు చేస్తూనే.. మరోవైపు ప్రజలు నిత్యావసరాల కోసం కష్టాలు పడకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఉచితంగా ప్రజలకు రేషన్ సరకులను అందజేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత సరుకులను పంపిణీ చేయగా, రెండో విడతకు సంబంధించిన రేషన్ సరుకులను ఈనెల 15 నుంచి పంపిణీ చేయనున్నారు. అయితే ఆ సరుకుల పంపిణీకి సంబంధించిన కూపన్లను ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఈ కూపన్లను వాలంటీర్లు లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి అందించనున్నారు. రేషన్ దుకాణాల వద్ద రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కూపన్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల సరుకుల కోసం రేషన్ దుకాణాల్లో ఏలాంటి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. దీంతో రేషన్ షాపుల్లో ఏలాంటి రద్దీ ఉండే అవకాశం లేదు. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.