సాధారణంగా రోడ్డుపై డబ్బులు పడి ఉండటాన్ని చూస్తే పరుగున వెళ్లి జేబులోకి వేసుకుంటాం. మరికొంత మంది అయితే డబ్బులు జేబులో వేసుకుని ఎవరికీ తెలియలేదన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. మరికొంతమంది అయితే ఆ డబ్బులు ఎవరివో అని స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు అలా జరగలేదు. కరోనా భయంతో అంతా భయం నెలకొంది. తాజాగా లఖ్నవూలో ఓ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై పడి ఉన్న రెండు రూ.500 నోట్లను తీసుకునేందుకు స్థానికులు ముందుకు రాలేదు. భయంతో దూరంగా జరిగారు. లఖ్నవూలోని పేపర్ మిల్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీలోనివారు రెండు రూ.500 నోట్లు తాము వెళ్లే దారిలో పడి ఉండటాన్ని గమనించారు. వాటిని తీసుకోవడానికి బదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరోనా వైరస్ను వ్యాప్తి చేయడానికే ఎవరో వాటిని ఇక్కడ పడేశారన్న అనుమానంతో గుమిగూడి చర్చలు మొదలు పెట్టారు. ఆపై పోలీసు హెల్ప్లైన్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు వాటిని దగ్గర్లోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా వైద్యుడు 24 గంటల పాటు వాటిని ముట్టుకోకుండా వేరుగా ఉంచాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో వల్ల ప్రజలు భయాందోళన చెందారని అందుకే ఆ నోట్లను ఎవ్వరూ ముట్టుకోలేదని ఒక పోలీసు అధికారి వివరించారు. ఆ వీడియోకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.