ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి చైనాపై నిప్పులు చెరిగిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 10:48 AM

కోవిడ్- 19ను చైనా వైరస్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనాయే కారణమని ఆయన దుయ్యబట్టారు. వైరస్‌ గురించి సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ మండిపడ్డారు. అలాగే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తాజాగా, మరోసారి డ్రాగన్‌పై తీవ్రస్థాయిలో అగ్రరాజ్యాధినేత విరుచుకుపడ్డారు. అధ్యక్ష భవనంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధి చెందుతున్న స్థాయిని చైనా ఎప్పుడో దాటేసినా ఇంకా ఆ దేశాల మాదిరిగా అనేక ప్రయోజనాలు పొందడం నమ్మశక్యంగా లేదని ఆయన ఆరోపించారు.


ఒకవేళ చైనాకు ఆ హోదా సరైందే అయితే.. తమను కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే గుర్తించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రయోజనాలు చైనా పొందుతోంది.. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం.. అమెరికాలోనూ అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. గతాన్ని ఒక్కసారి చూస్తే తమ మద్దతుతో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)లో చేరిన తర్వాతే చైనా ఆర్ధికవృద్ధి గణనీయంగా పెరిగిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. డబ్ల్యూటీఓ నిబంధనల పేరిట పలు దశాబ్దాలుగా అమెరికా నుంచి చైనా ఎన్నో ప్రయోజనాలు పొందుతోందని... తద్వారా అగ్రరాజ్యాన్ని కొల్లగొట్టిందని ట్రంప్ ఆరోపించారు.


 


ఈ విషయంలో తాను చైనాను ఏమాత్రం తప్పుబట్టడం లేదని.. ఇలా జరుగుతున్నా ఇన్నాళ్లూ చోద్యం చూసిన తమ పాలకులపైనే తన అసంతృప్తి అన్నారు. తన పాలనలో ఇలాంటివి జరగడానికి అనుమతించే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఉత్పత్తులపై విధించిన పన్నుల ద్వారా దేశ ఖజానాకు వేల కోట్ల డాలర్ల ఆదాయం సమకూరుతోందని వివరించారు.


 


వారు నిజాయితీగా వ్యవహరించకపోతే, తాము చేయాల్సింది చేస్తామని..ఇప్పుడే ఆట మొదలైందని అన్నారు. ప్రతి దేశం చైనా కాదు, డ్రాగన్ తన కరెన్సీని తగ్గించుకుని ఎక్కువ శాతం సుంకాలను మనకు చెల్లించడంలేదని దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ గురించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రపంచదేశాలకు తెలపడంలో చైనా విఫలమైందని ట్రంప్ గత నెలలో ఆరోపించారు. అంతేకాదు, కరోనా తీవ్రతను ప్రపంచానికి తెలియనీయకుండా అడ్డుకున్న చైనా.. అక్కడి వైద్యులు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుందని అన్నారు. ఇలా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన చైనా దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com