కరోనా దెబ్బకు రక్తానికి కూడా కొరత ఏర్పడింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అదే సమయంలో ఎవరికైనా కరోనా ఉండే ప్రమాదం ఉందని రక్తాన్ని సేకరించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం లేదు.. డోనార్స్ కూడా ముందుకు రావడం లేదు. ఈ మేరకు ఇప్పటికే బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. బ్లడ్ అత్యవసరమై వచ్చిన వారికి బ్లడ్ బ్యాంక్ల నిర్వాహకులు అందించలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 174 బ్లడ్ బ్యాంకులుండగా అందులో 83 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలో తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా వ్యాధులతో బాధపడే పేషెంట్లకు ప్రతి నెలా కచ్చితంగా రక్తం ఎక్కించాలి. ప్రస్తుతం వీరికి ఎమర్జెన్సీ డెలివరీ కేసులకు మాత్రమే బ్లడ్ ఇస్తున్నామని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక వీరితో పాటు కేన్సర్ పేషెంట్లకు కూడా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వీటి నిల్వ కూడా ప్రస్తుతం లేదు. ఇదిలా ఉండగా, గవర్నమెంట్ హాస్పిటల్స్కు డోనర్స్ రాకపోతుండడంతో ఐపీఎం(ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్)ద్వారా బ్లడ్ సేకరించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె స్పందించి.. ఆర్మీ ఆఫీసర్స్కు చెప్పడంతో ప్రస్తుతం రోజూ 20 యూనిట్లు డొనేట్ చేస్తున్నారు. ఇది కూడా సరిపోవడం లేదు.