లాక్డౌన్ గడువు ముగియడానికి ఇంకా తొమ్మిది రోజులే టైం ఉంది. కరోనా పరిస్థితి చూస్తే మాత్రం దారుణంగా ఉంది. గత నాలుగైదు రోజలుగా కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ వైరస్ పంజా విసురుతోంది. ముఖ్యంగా మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లపై ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. వారి నుంచి మరింత మందికి సోకే ప్రమాదమూ లేకపోలేదు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3219 కేసులు నమోదయ్యాయి. అందులో 83 మంది మరణించారు. అటు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారితో ఎంత మందికి వైరస్ సోకింది? వారి వల్ల ఇంకెంత మంది ప్రభావితం అయ్యారన్న స్పష్టత ఇప్పటికి లేదు. శని, ఆదివారాల్లో కేసులు బాగానే పెరిగాయి.
లాక్డౌన్ ముగియడానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఆలోగా కేసుల సంఖ్య తగ్గి పరిస్థితి అదుపులోకి వస్తే సరి. లేకపోతే మాత్రం.. ఆ గడువును మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. లాక్డౌన్ గడువును పొడిగించే ఉద్దేశం లేదని కేంద్రం చెబుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో గడువును పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరో 15 రోజులు అంటే.. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.