మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రీడా లోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. సిరీస్లన్నీ రద్దు కావడంతో ఆదాయం కోల్పోయిన అన్ని క్రికెట్ దేశాల బోర్డులు తమ ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలని చూస్తున్నాయి. కానీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం తమ ఆటగాళ్లకు పూర్తి జీతాల్ని చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటి వరకూ జీతాల కోతపై ఎలాంటి చర్చ జరగలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేసాడు.
భారత ఆటగాళ్ల జీతాల కోతపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవు. ఇప్పటికైతే మొత్తం జీతాన్ని క్రికెటర్లకి అందజేయనున్నట్లు అరుణ్ దుమాల్ స్పష్టం చేశాడు. కరోనా తెచ్చిన నష్టాల నేపథ్యంలో.. ఆటగాళ్ల జీతాలపై కోత పడే అవకాశమున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి అలాంటి చర్చే ఏమీ జరగలేదని బోర్డు కోశాధికారి స్పష్టం చేశాడు. దీంతో భారత ఆటగాళ్లు అందరూ మొత్తం జీతం అందుకోనున్నారు.
టీమిండియా తరపున ఆడే క్రికెటర్లకి ఏటా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కొత్త కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకూ మొత్తం 27 మంది ఆటగాళ్లకి కాంట్రాక్ట్లో చోటిచ్చింది. కాంట్రాక్ట్ ప్రకారం.. ఎ+ కేటగిరీలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకి ఏటా రూ. 7 కోట్లు అందుతాయి. ఎ కేటగిరీలో ఉన్న ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, చటేశ్వర పుజారా, అజింక్య రహానెలకు రూ. 5 కోట్లు దక్కుతాయి. ఇక బి కేటగిరీ వాళ్లకి రూ. 3 కోట్లు, సి కేటగిరీలో ఉన్న వారికి రూ. 1 కోటి దక్కుతుంది.
మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలుత ఐపీఎల్ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసినా.. కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ రద్దైతే ఒప్పందం మేరకు ఆటగాళ్లకు ఎటువంటి వేతనాలు చెల్లించేది లేదని ఓ ఫ్రాంఛైజీ అధికారి స్పష్టం చేశారు. దీంతో నో ప్లే.. నో పే.. ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ల ముందున్న పరిస్థితి ఇదే.
నిజానికి ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుపై విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లేమీ ఆధారపడి లేరు. వారు ఇతరత్రా వ్యాపారాలతో వందల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ.. చిన్న నగరాల నుంచి ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్న యువ ఆటగాళ్లకు, దేశవాళీల్లో రాణిస్తున్న వారికి ఈ లీగ్ జరగడం చాలా ముఖ్యం. లీగ్ జరగకుంటే.. ఆర్థికంగా చాలా ప్రభావం పడుతుంది. కొత్తగా ఆడుతున్న వారికైతే రూ.20 నుంచి 40, 60 లక్షలు దక్కినా.. అది వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.