ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కరోనావైరస్ సోకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి భయంకరమైన వైరస్ పేరు మన ఇండియాలోనే ఓ గ్రామానికి ఉన్నట్లు చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఆ గ్రామం పేరు ఒక హాట్ టాపిక్ గా నిలిచింది. ఎందుకంటే ఆ గ్రామం పేరు 'కరౌనా'. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నుండి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న కుగ్రామం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా మహమ్మారి పేరు తమ గ్రామానికి ఉండడంతో అక్కడి గ్రామస్తులు చింతిస్తున్నారు. 9000 మంది జనాభా ఉన్న ఈ గ్రామం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లా మిశ్రీక్ తహశీల్ పరిధిలోకి వస్తుంది. కొన్ని దశాబ్ధాలుగా ఈ చిన్న కుగ్రామం ఇక్కడ ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈ గ్రామం ఎప్పుడూ లేని గుర్తింపును పొందింది. గ్రామస్తులు తమ గ్రామం పేరు చెప్పి ఇతరులకు పరిచయం చేసుకున్నప్పుడు భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయని వారు చెబుతున్నారు. చాలా మంది తమ గ్రామం పేరును ఎగతాళి చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు. కరౌనా గ్రామం ఇప్పుడు బయటి వారికి అపహాస్యం కలిగించే అంశంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తూ ముప్పు తిప్పలు పెడుతున్న కరోనా వైరస్ పేరుకు ఈ గ్రామం పేరు దగ్గరగా ఉండడమే దీనికి కారణం. 84 - కోసీ పరిక్రమలో కరౌనా గ్రామం మొదటి హాల్ట్ గా నిలుస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ తరువాత పక్షం రోజుల పాటు వేలాది మంది చేపట్టే తీర్ధయాత్ర ఇది. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ యాత్రను రద్దు చేశారు. ఇండియాలో కరోనా గ్రామం ఉందని చాలా మందికి తెలియడంతో వారంతా ఆశ్చర్యపోతున్నారు. కరోనా పేరును చెప్పి తిట్టుకుంటున్నారని కరోనా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.