ఏడాదిలో కోటి రూపాయిల సంపాదన. వినేందుకే నోరు ఊరిపోయే మాట. అలాంటిది ఏడాదిలో ఏకంగా రూ.25 కోట్ల సంపాదన. ఈ సంపాదన అంతా వ్యవసాయంలోనే అంటే మీరు నమ్ముతారా? కచ్చితంగా నోరెళ్లబెడతారు. కానీ అది నిజం. గుజరాత్ కు చెందిన ఒక కుటుంబం కేవలం బంగాళ దుంపల్ని పండిస్తూ ఏడాదిలో రూ.25 కోట్లు సంపాదించడం ఇప్పుడు సంచలనమయ్యింది. వ్యవసాయంతో అన్నేసి కోట్లు సంపాదిస్తున్న వారెవరు? వారెక్కడ ఉంటారు? ఇంతకూ అంత భారీ మొత్తాన్ని వారెలా సంపాదిస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. గుజరాత్ కు చెందిన అరవల్లి జిల్లా దోల్ పూర్ కంపాకు చెందిన జితేష్ పటేల్ అనే రైతు బంగాళ దుంపల్ని పండిస్తుంటాడు. ఆయన కుటుంబం గడిచిన పాతికేళ్లుగా బంగాళదుంపల్ని పండిస్తోంది. తాజాగా గ్లోబల్ పొటాలో కాంక్లేవ్ 2020లో పాల్గొన్న జితీశ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఎమ్మెసీ అగ్రికల్చర్ చదివానని.. కోర్సులో నేర్చుకున్న మెళుకువలను తాను పంట పండించేందుకు ఉపయోగించానని చెప్పారు. 2007లో తాము 10 ఎకరాల్లో ఎల్ ఆర్ బంగాళాదుంప పంటను పండించటం మొదలుపెట్టి ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పారు. ఎల్ ఆర్ రకానికి చెందిన ప్రత్యేక బంగాళాదుంప తయారీదారులకు విపరీతమైన డిమాండ్ ఉందన్న ఆయన ఈ రకం ఆలూను సాగు చేసినట్లు తెలిపారు. ఇండోనేషియా, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా తదితర దేశాలు తమ దగ్గర నుంచి బంగాళాదుంపలను కొనుగోళ్లు చేస్తున్నాయని చెప్పారు. తాము పండించిన బంగాళదుంపల్ని ఇండియాలోని ప్రముఖ కంపెనీలు కూడా కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. తమ కుటుంబంలోని వారికి పాథాలజీ, మైక్రోబయాలజీ, హార్టికల్చర్ తదితర రంగాల్లో నైపుణ్యం ఉందని, అందుకే కుటుంబమంతా కలిసి వ్యవసాయం చేస్తూ ఇంత భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నట్లుగా చెప్పారు.