అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్వేతసౌధంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని ఇటీవల ఓ సందర్భంలో అభిప్రాయపడ్డ ట్రంప్ ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కితగ్గడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.